చెన్నై – మాజీ కేంద్ర మంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలలో కలకలం రేపుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ కూటమి అద్భుత విజయాన్ని సాధించాయని, ఇలాగే కొనసాగుతూ పోతే వచ్చే 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీకి తిరుగు ఉండదన్నారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి అధికారం రాదని తేలి పోయిందన్నారు.
ఆయన కేంద్ర సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానంగా మోదీకి మద్దతుగా రెండు సంస్థలు పని చేస్తున్నాయని వాటిలో ఒకటి కేంద్ర ఎన్నికల సంఘం అని ఆరోపించారు. అది పూర్తిగా పీఎంకు సరెండర్ అయ్యిందన్నారు. దీంతో ఎలా కాంగ్రెస్ పార్టీ , దాని మిత్రపక్షాలు అధికారంలోకి వస్తాయని ప్రశ్నించారు చిదంబరం.
ప్రధానంగా బీజేపీకి సంస్థాగత పరంగా బలమైన కేడర్ కలిగి ఉందన్నారు. ఆ పార్టీ కోసం ఎన్నో సంస్థలు లోపాయికారిగా చాప కింద నీరులా పకడ్బందీగా పని చేస్తున్నాయని ప్రశంసించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు అసంతృప్తి నెలకొందన్నారు. ఇక ఇండియా కూటమిలో సమన్వయం లేక పోవడం కూడా ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు చిదంబరం. ఇక ఇప్పటి నుంచైనా వాస్తవాలు తెలుసుకుని ప్రయత్నం చేస్తే పరువు పోకుండా ఉంటుందని హితవు పలికారు.