విశాఖపట్నం – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీపై. విశాఖపట్నంలో సర్కార్ ఆధ్వర్యంలో 11వ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా యోగాను విశ్వ వ్యాప్తం చేయడంలో కీలకమైన పాత్ర పోషించారంటూ పీఎంకు కితాబు ఇచ్చారు. ఆయనను దార్శనికుడంటూ పేర్కొన్నారు. అంతే కాకుండా భారతీయ సనాతన ధర్మం విశిష్టతను యావత్ ప్రపంచానికి తెలియ చేసిన గొప్ప వ్యక్తి మన పీఎం అన్నారు.
ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గౌరవమని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ కొణిదల. అంతే కాదు ప్రతి ఒక్కరు యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా మార్చు కోవాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదం మన విధానం కావాలని చెప్పారు డిప్యూటీ సీఎం. అంతకు ముందు సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. వచ్చే సెప్టెంబర్ లో యోగా సూపర్ లీగ్ నిర్వహించాలన్నారు. అంతే కాకుండా ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ లో యోగాను భాగం చేసేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.
ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తేశారు నారా చంద్రబాబు నాయుడు. చరిత్ర సృష్టించాలన్నా, రికార్డులు తిరగ రాయాలన్నా ఈ దేశంలో ఒక్క మోదీకే సాధ్యమని అన్నారు. ఉన్నట్టుండి మనోడు రూటు మార్చడంపై అందరూ విస్తు పోయారు. సామాన్యంగా చంద్రబాబు ఎవరినీ పైకి ఎత్తడు. ఇంకెవరీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడు. ఆయన స్టైల్ వేరు. ఏమైనా అంటే ఇండియాలో ఐటీ సృష్టికర్తను తానేనని గొప్పలు చెప్పడం అలవాటుగా మారింది.