ఐపీఎల్ ఫైన‌ల్ కు చేరుకున్న పంజాబ్

5 వికెట్ల తేడాతో ముంబై ఇండియ‌న్స్ కు షాక్

గుజ‌రాత్ – ఐపీఎల్ 2025 మెగా టోర్నీ చివ‌రి అంకానికి చేరుకుంది. అహ్మ‌దాబాద్ లోని మోదీ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్ -2 కీల‌క మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ సూప‌ర్ షోతో ఆక‌ట్టుకుంది. ప్ర‌ధానంగా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. క్వాలిఫ‌య‌ర్ -1లో చేతులెత్తేసిన పంజాబ్ ఉన్న‌ట్టుండి క్వాలిఫ‌య‌ర్ -2లో స‌త్తా చాటింది. ముంబై ఇండియ‌న్స్ నిర్దేశించిన 204 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం 5 వికెట్లు కోల్పోయి 19 ఓవ‌ర్ల‌లోనే ప‌ని కానిచ్చేసింది.

ఇప్ప‌టికే ఫైన‌ల్ కు చేరుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో తుది పోరుకు సిద్ద‌మైంది. జూన్ 3న మంగ‌ళ‌వారం ఇదే వేదిక‌పై టైటిల్ కోసం త‌ల‌ప‌డ‌నుంది. శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ముంబై బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. 41 బంతులు ఎదుర్కొని 87 ర‌న్స్ చేశాడు. 5 ఫోర్లు 8 భారీ సిక్స‌ర్ల‌తో అద‌రగొట్టాడు. జ‌ట్టును విజ‌య ప‌థంలో ముందుండి న‌డిపించాడు. స్కిప్ప‌ర్ కు తోడు నెహాల్ వ‌ధేరా 48 ర‌న్స్ చేయ‌గా జోష్ ఇంగ్లిస్ 38 ప‌రుగుల‌తో రాణించారు.

అంత‌కు ముందు ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 203 ర‌న్స్ చేసింది. తిల‌క్ వ‌ర్మ 29 బంతుల్లో 44 ర‌న్స్ చేయ‌గా, సూర్య కుమార్ యాద‌వ్ 26 బంతుల్లో 44 ప‌రుగులు చేశాడు.జానీ బెయిర్ స్టో 24 బంతుల్లో 38 ర‌న్స్ చేశాడు. న‌మ‌న్ ధీర 18 బంతుల్లో 7 ఫోర్ల‌తో 37 ప‌రుగులు చేశాడు.

Comments (0)
Add Comment