హైదరాబాద్ – రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. గత బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చెలరేగి పోయాడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, జర్నలిస్టులు, ఉన్నతాధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికంతటికి ప్రధాన కారకుడు సీఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అని తేలి పోయింది.
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే హార్డ్ డిస్క్ లను మాయం చేశారు. మరికొన్నింటిని దగ్ధం చేయడం అప్పట్లో కలకలం రేపింది. దీనిపై ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సర్కార్ మారిన తక్షణమే తనకు అనారోగ్యం బాగా లేదన్న సాకుతో అమెరికాకు చెక్కేశాడు. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా స్పందించ లేదు. పైగా తాను రాలేనంటూ సొల్లు కబుర్లు చెప్పాడు. దీంతో సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దెబ్బకు మనోడు దిగి వచ్చాడు.
ప్రభాకర్ రావుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కోర్టు. వెంటనే హాజరు కావాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభాకర్ రావు సిట్ ముందుకు హాజరయ్యారు. కానీ ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం లేదని టాక్. ఇప్పటికే రోజూ 8, 9 గంటల పాటు విచారణ చేపడుతున్నా వర్కవుట్ కావడం లేదు. దీంతో మరోసారి జూన్ 17న తమ ముందు హాజరు కావాలని సిట్ ఆదేశించింది.