ముంబై – ప్రముఖ బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు యజమానులలో ఒకరైన ప్రీతి జింతా కోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే ఆ జట్టు ప్లే ఆఫ్స్ లోకి చేరుకుంది. ఈసారి జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. ఉన్నట్టుండి వివాదం చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఈ మేరకు తనను సంప్రదించకుండానే, తనకు తెలియకుండానే కో డైరెక్టర్లు సమావేశం నిర్వహించారంటూ ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ కోర్టుకు ఎక్కింది.
పంజాబ్ జట్టు సహ డైరెక్టర్లు మోహిత్ బుర్మాన్, నెస్ వాడియాపై చండీగఢ్ కోర్టులో కేసు వేసింది బాలీవుడ్ నటి ప్రీతి జింటా. నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించారని పిటిషన్లో పేర్కొంది. గత నెల 21న నిర్వహించిన సర్వసభ్య సమావేశం చట్టబద్ధత గురించి కోర్టులో సవాలు చేసింది. కంపెనీ చట్టం 2013 ప్రకారం ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఈ సమావేశాన్ని నిర్వహించారని ఆరోపించింది. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా సమర్పించింది.
భేటీకి సంబంధించి అభ్యంతరాలను తాను ఏప్రిల్ 10వ తేదీనే ఈమెయిల్ రూపంలో తెలియ చేశానని తెలిపింది. అయినా పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. నెస్ వాడియా మద్దతుతో మోహిత్ బర్మాన్ ఈ సమావేశాన్ని నిర్వహించారని సంచలన ఆరోపణలు చేసింది.