సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ కు అరుదైన గుర్తింపు లభించింది. ఇవాళ యావత్ ప్రపంచం మొత్తం 11వ యోగా డేను నిర్వహిస్తోంది. విశాఖ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ పాల్గొన్నారు. 3 లక్షల మందికి పైగా యోగా ర్యాలీ నిర్వహించారు. భారీ ఎత్తున జనం యోగాసనాలు చేపట్టారు. గిన్నిస్ బుక్ రికార్డ్ లో చోటు దక్కించుకుంది యోగాంధ్ర కార్యక్రమం.
ఇదిలా ఉండగా ఉన్నట్టుండి లైమ్ లైట్ లోకి వచ్చారు నటి రకుల్ ప్రీత్ సింగ్. తమ జంటకు ఫిట్ ఇండియా కపుల్ అవార్డు దక్కిందని వెల్లడించింది. యోగా డే సందర్బంగా తమకు ఈ పురస్కారం దక్కడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ఎంతో గర్వ కారణంగా ఉందన్నారు. యోగా పట్ల ప్రజలను ఆకర్షించేలా చేయడంలో తాము కీలక పాత్ర పోషిస్తూ వచ్చామని చెప్పారు నటి.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు రకుల్ ప్రీత్ సింగ్. యోగా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, వాటిని ఆచరిస్తే అద్భుతాలు స్వంతం చేసుకోవచ్చని చెప్పారు. యోగా సాధన చేయడం వల్ల కీలక మార్పులు కలుగుతాయని అన్నారు. ప్రతి ఒక్కరు తమ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగా వల్ల మానసిక శాంతి చేకూరుతుందని, నిత్యం ఆనందంగా ఎలా ఉండాలో దీనిని ఆచరిస్తే అర్థం అవుతుందన్నారు నటి.
యోగా ఓ వరమని, ఇది భారతీయ పరంపరకు దర్పణమని పేర్కొన్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఈ అరుదైన సమయంలో తమకు ఈ పురస్కారం రావడం మరింత సంతోషాన్ని, ఇంకొంత బలాన్ని కలిగించేలా చేసిందన్నారు.