కోట్లాది మంది కళ్లల్లో వత్తులు వేసుకుని చూశారు. బంతికి బ్యాట్ కు మధ్య యుద్దం ఎలా ఉంటుందో కళ్లారా చూశారు. అందుకే ఐపీఎల్ ఫార్మాట్ కు అంత క్రేజ్. అహ్మదాబాద్ వేదికగా 18వ టాటా ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరిగింది. రెండు జట్లు తొలిసారిగా చివరి పోరాటానికి సిద్దమయ్యాయి. చివరి బంతి దాకా నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ కొనసాగింది.
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఏ జట్టు గెలిచినా హార్ట్ బ్రేక్ కావడం ఖాయమని స్పష్టం చేసింది. లక్ష మందికి పైగా ప్రేక్షకులు మోదీ స్టేడియంలో కొలువు తీరారు. తమ అభిమాన ఆటగాళ్ల ఆట తీరును స్వయంగా చూశారు. ఆనంద డోలికల్లో మునిగి పోయారు. మ్యాచ్ అన్నాక గెలుపు ఓటములు సహజం. కానీ అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇటు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్లు స్పూర్తి దాయకమైన ఆట తీరును ప్రదర్శించాయి.
ఈ టోర్నమెంట్ లో సమిష్టి కృషితో ఇరు జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. విచిత్రం ఏమిటంటే క్వాలిఫయర్ -1 ఆర్సీబీ చేతిలో పంజాబ్ ఓటమి పాలైంది. ఇదే జట్టు ముంబై ఇండియన్స్ ను క్వాలిఫయర్ 2లో ఓడించి ఫైనల్ కు చేరుకుంది. కానీ ఇక్కడ బోల్తా పడింది. 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి బంతి దాకా ప్రయత్నం చేసింది. కేవలం ఆరు పరుగుల దూరంలో కప్ ను కోల్పోయింది. మొత్తంగా సమిష్టి కృషితో రజత్ పాటిదార్ నాయకత్వంలో ఆర్సీబీ సూపర్ షోతో ఛాంపియన్ గా నిలిచింది. హ్యాట్సాఫ్ ఆర్సీబీ టీం.