హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రైతులకు పూర్తి భరోసా ఇస్తున్నామని, గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశారని ఆవేదన చెందారు. పోతూ పోతూ ఖజానాను ఖాళీ చేసి వెళ్లి పోయారంటూ మండిపడ్డారు. ఏనాడూ రైతుల గురించి పట్టించుకున్నారా అంటూ మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తాను రైతు బిడ్డనని, రైతుల ఇబ్బందులు ఏమిటో తనకు బాగా తెలుసుని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి.
రైతులతో రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు ప్రశ్నలకు ఆయన సావధానంగా జవాబు ఇచ్చారు. రైతులకు తీపి కబురు చెప్పారు. రైతు భరోసా ప్రకటించిన విధంగా తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని అన్నారు. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. మొత్తం 9 రోజుల్లో పెట్టుబడి సాయం అందుతుందన్నారు.
ఎవరైనా జమ కాకపోతే సంబంధిత వ్యవసాయ, రెవెన్యూ అధికారులను సంప్రదించాలని, ఏ ఒక్కరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రైతులకు 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారు. రైతును రాజుగా చేయడమే కాదు.. వ్యవసాయాన్ని పండగా చేస్తామన్నారు. రైతుల ఆశీర్వాదం ఉంటేనే పాలకుల కుర్చీలు పదిలంగా ఉంటాయన్నారు.