Sai Durgha Tej : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే చాలు.. ముందుగా సాయం అందించేది మెగాస్టార్ చిరంజీవే. అలాగే మెగాస్టార్ తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దానధర్మాలు గురించి ఎక్కడికి వెళ్లినా కథలుకథలుగా చెబుతుంటారు. సాయం అంటే చాలు మెగా ఫ్యామిలీ అన్నట్లుగా మెగాస్టార్ మార్చేశారు. ఇప్పుడు మేనమామల దారిలోనే వారి మేనల్లుడు సాయి దుర్గ తేజ్ కూడా నడుస్తున్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నాం.. ఆదుకోవాలి అంటే చాలు వెంటనే స్పందిస్తూ.. వారికి తగినంత సాయం చేసి పంపుతున్నాడు సాయి దుర్గ తేజ్. ఇప్పుడిదంతా ఎందుకూ అంటే.
Sai Durgha Tej Helps..
మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్(Sai Durgha Tej). చిన్నారి గుండెలకు తన వంతు భరోసా కల్పించారు. ‘ వరల్డ్ హార్ట్ డే’ సందర్భంగా ‘ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్’ హైదరాబాద్ బంజారాహిల్స్ రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సాయి దుర్గ తేజ్. చిన్నారుల్లో హృదయ సంబంధ సమస్యలకు చికిత్స అందించేందుకు ‘ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్’ చేస్తున్న ప్రయత్నాన్ని సాయి దుర్గ తేజ్ అభినందించారు. ఈ సంస్థకు తన వంతుగా రూ. 5 లక్షల విరాళాన్ని అందించారు. మనమంతా కలిసి పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తును సృష్టిద్దామంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్. ఆయన మంచి మనసును రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు, ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వాహకులు ప్రశంసించారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే సాయి దుర్గతేజ్(Sai Durgha Tej).. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడిన తెలుగు ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా 20 లక్షల రూపాయల విరాళాన్ని అందించిన విషయం తెలిసిందే. అలాగే విజయవాడలో పర్యటించి అమ్మ అనాథాశ్రమానికి 2 లక్షల రూపాయలు, ఇతర సేవా సంస్థలకు 3 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. తనకు వీలైనంత సేవా కార్యక్రమాలు చేస్తూ అవసరంలో ఉన్న వారికి అండగా నిలబడుతూ మామలకు తగ్గ మేనల్లుడిగా రియల్ హీరో అనిపించుకుంటున్నారు సాయి దుర్గ తేజ్.
Also Read : Ram Charan : మేడమ్ టుస్సాడ్స్ లో పెట్టనున్న గ్లోబల్ స్టార్ మైనపు విగ్రహం