హైదరాబాద్ – మెట్రో రైలు రెండవ దశ (బి) నిర్మాణం త్వరలోనే రూపు దిద్దుకోనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిపాదనలను సిద్దం చేశామన్నారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ ప్రాజెక్టులో 3 కారిడార్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 7168 కోట్లతో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి భారత్ ఫ్యూచర్ సిటీ దాకా 39.6 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపడతామన్నారు.
అలాగే రూ. 6,946 కోట్లతో జేబీఎస్ నుండి మేడ్చల్ దాకా 24.5 కిలోమీటర్ల మేర విస్తరించనున్నట్లు వెల్లడించారు. రూ. 5,465 కోట్లతో జేబీఎస్ నుండి శామీర్ పేట దాకా 22 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయనున్నట్లు స్పష్టం చేశారు మేనేజింగ్ డైరెక్టర్. మొత్తం 86.1 కి.మీ పొడవును కవర్ చేస్తూ, ఈ దశ 2 (బి) ప్రాజెక్టులో మొత్తం రూ. 19,579 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ. 5,874 కోట్లు కాగా అంటే 30 శాతం ఉంటుందన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ. 3,524 కోట్లు ఉంటుందని అంటే 18 శాతం వాటా కలిగి ఉంటుందని చెప్పారు ఎన్వీఎస్ రెడ్డి.
కాగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి రుణం కింద రూ. 9,398 కోట్లు (48%) తీసుకుంటామన్నారు. పీపీపీ ద్వారా రూ. 783 కోట్లు అదనంగా సమీకరించడం జరుగుతుందన్నారు ఎండీ.