అమరావతి – అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు జర్నలిస్ట్ కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. తను చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. పెద్ద ఎత్తున మహిళలు రోడ్డుపైకి వచ్చారు. నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. చెప్పులతో జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజుల ఫోటోలపై దాడి చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సమయంలో సాక్షి ఛానల్ లో యాంకర్ గా ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వేశ్యల రాజధాని పేరుతో చర్చను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అనలిస్ట్ గా విజయవాడకు చెందిన జర్నలిస్ట్ కృష్ణం రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అది రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర రాద్ధాంతం చోటు చేసుకుంది. దీంతో గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కొమ్మినేని శ్రీనివాస రావుతో పాటు కృష్ణంరాజులపై కేసు నమోదు చేశారు. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ లో ఉన్న కొమ్మినేనిని తన నివాసంలో నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.
అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. ఆ వెంటనే మంగళగిరి కోర్టులో హాజరు పర్చారు. ఈ సందర్బంగా కీలకమైన వాదనలు చోటు చేసుకున్నాయి. చివరకు వాదనలు విన్న అనంతరం జడ్జి కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జర్నలిస్టు కృష్ణంరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడలో తన ఇంటికి తాళం వేసి ఉండడంతో చివరకు ఎట్టకేలకు పట్టుకున్నారు. తనను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. మొత్తంగా ఛానల్ ఉందని కొమ్మినేని , తనకు ఛాన్స్ ఇచ్చారని కృష్ణంరాజులు రెచ్చి పోయారు. ప్రతి దానికి ఓ లక్ష్మణ రేఖ ఉంటుందని తెలియక పోవడం విడ్డూరం.