అయ్యారే అదుర్స్ ముంబై ఇండియ‌న్స్ షాక్

పంజాబ్ కింగ్స్ స్కిప్ప‌ర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్

నాయ‌కుడు అంటే ఎలా ఉండాలో త‌న‌ను చూసి నేర్చుకునేలా చేశాడు పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ స్కిప్ప‌ర్ శ్రేయాస్ అయ్య‌ర్. గ‌త ఏడాది 2024లో జ‌రిగిన ఐపీఎల్ సీజ‌న్ లో దుమ్ము రేపాడు. త‌ను ద‌గ్గ‌రుండి కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టును న‌డిపించాడు. విజ‌య ప‌థంలోకి తీసుకు వెళ్లాడు. దీనిని ముందే గుర్తించింది పంజాబ్ కింగ్స్ జ‌ట్టు మేనేజ్మెంట్. భారీ ధ‌ర‌కు అయ్య‌ర్ ను కొనుగోలు చేసింది ఓన‌ర్ , ప్ర‌ముఖ న‌టి ప్రీతి జింతా. త‌ను పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వమ్ము చేయ‌లేదు. కోల్ క‌తాకు క‌ప్ తీసుకు వ‌చ్చిన అయ్య‌ర్ ఇప్పుడు ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ ను 12 ఏళ్ల త‌ర్వాత ఫైన‌ల్ కు చేర్చ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

ప్ర‌త్య‌ర్థి ముంబై ఇండియ‌న్స్ విసిరిన భారీ ల‌క్ష్యం 204 ర‌న్స్ ను ఇంకా ఒక ఓవ‌ర్ మిగిలి ఉండ‌గానే పూర్తి చేశాడు. తానే ద‌గ్గ‌రుండి త‌న జ‌ట్టుకు గ్రాండ్ విక్ట‌రీ అందించాడు. త‌న‌తో పాటు నేహాల్ వ‌ధేరా సూప‌ర్ షో చేశాడు. ఇద్ద‌రూ క‌లిసి గెలుపు అంచుల దాకా తీసుకు వెళ్లారు. ఇక అయ్య‌ర్ పోర్లు , సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. కేవ‌లం 41 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న శ్రేయాస్ 87 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

అంత‌కు ముందు ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 203 ర‌న్స్ చేసింది. తిల‌క్ వ‌ర్మ 29 బంతుల్లో 44 ర‌న్స్ చేయ‌గా, సూర్య కుమార్ యాద‌వ్ 26 బంతుల్లో 44 ప‌రుగులు చేశాడు.జానీ బెయిర్ స్టో 24 బంతుల్లో 38 ర‌న్స్ చేశాడు. న‌మ‌న్ ధీర 18 బంతుల్లో 7 ఫోర్ల‌తో 37 ప‌రుగులు చేశాడు. ఈసారి క‌ప్ గెలిపించాల‌ని హార్దిక్ పాండ్యా చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ లేదు. వారి ఆశ‌లపై నీళ్లు చ‌ల్లాడు శ్రేయాస్ అయ్య‌ర్.

Comments (0)
Add Comment