ఢిల్లీ – ఐపీఎల్ మెగా టోర్నీలో మరోసారి భారీ స్కోర్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. టోర్నీ నుంచి పోతూ పోతూ కోల్ కతా నైట్ రైడర్స్ కు ఝలక్ ఇచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లకు చుక్కలు చూపించింది. పరుగుల వరద పారించింది. ఆకాశమే హద్దుగా చెలరేగారు హైదరాబాద్ ఆటగాళ్లు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా టోర్నీలోనే ఇది మూడో భారీ స్కోర్ చేయడం విశేషం.
హైద్రాబాద్ జట్టులో హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. 7 ఫోర్లు 9 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 105 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 40 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 6 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
భారీ లక్ష్యంతో మైదానంలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో 168 పరుగులకే చాప చుట్టేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు దుమ్ము రేపాడు. కోల్ కతా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. పరుగులు చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. 110 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. మనీష్ పాండే 37 రన్స్ , హర్షిత్ రానా 34 పరుగులు చేసి రాణించారు. ఎస్ ఆర్ హెచ్ బౌలర్లలో ఉనద్కత్ 24 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. హర్ష్ దూబే 34 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.