స‌న్ రైజ‌ర్స్ సెన్సేష‌న్ ఆర్సీబీ ప‌రేషాన్

దంచి కొట్టిన ఇషాన్ కిష‌న్ ..బెంగ‌ళూరు ఓట‌మి

ఉత్త‌ర ప్ర‌దేశ్ – ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ఊహించ‌ని దెబ్బ త‌గిలింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు. ఆ జ‌ట్టు ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. ప్లే ఆఫ్స్ కు చేరుకున్న జ‌ట్ల‌కు పోతూ పోతూ కోలుకోలేని ఝ‌లక్ ఇచ్చింది ఎస్ ఆర్ హెచ్. ఆ జ‌ట్టు ఏకంగా ఆర్సీబీపై 42 ప‌రుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ సూప‌ర్ షో చేసింది. ప్ర‌ధానంగా ఇషాన్ కిష‌న్ మ‌రోసారి రెచ్చి పోయాడు.

ఆర్సీబీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. 94 ర‌న్స్ చేశాడు. క్రీజు లోకి వ‌చ్చిన ప్ర‌తి ఆట‌గాడు దుమ్ము రేపాడు. కొడుతూనే పోయారు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 231 రన్స్ చేసింది. ఇందులో 48 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు కిష‌న్. తను నాటౌట్ గా నిలిచాడు. ఇంకా ఆరు ప‌రుగులు చేసి ఉంటే సెంచ‌రీ న‌మోదు చేసేవాడు. అభిషేక్ శ‌ర్మ 17 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 34 ర‌న్స్ చేశాడు. ఇక అనికేత్ వ‌ర్మ కేవ‌లం 9 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 3 సిక్స‌ర్ల‌తో 26 ర‌న్స్ చేశాడు.

అనంత‌రం బ‌రిలోకి దిగిన ఆర్సీబీ సైతం ధాటిగానే ఆడింది. కానీ 19.5 ఓవ‌ర్ల‌లోనే 189 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. మిచెల్ సాల్ట్ 62 ర‌న్స్ చేస్తే విరాట్ కోహ్లీ 43 ప‌రుగులు చేశాడు. ఆ త‌ర్వాత ఆర్సీబీ ప్లేయ‌ర్లు తేలి పోయారు. దీంతో ఓట‌మి త‌ప్ప‌లేదు.

Comments (0)
Add Comment