ఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కొనసాగుతున్న కంచ గచ్చిబౌలి భూ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ నష్టంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా రాష్ట్ర ఉన్నతాధికారులను ఏకి పారేసింది. పర్యావరణాన్ని పరిరక్షించక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ప్రధాన కార్యదర్శి, ఇతర కీలక అధికారులకు జైలు శిక్ష తప్పదని మండిపడింది.
వివాదాస్పద భూమిపై సుదీర్ఘ వారాంతంలో పనులు ఎందుకు జరిగాయని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను కోర్టు ప్రశ్నించింది. ఏదైనా నిర్మాణ కార్యకలాపాలతో ముందుకు సాగడానికి ముందు అవసరమైన పర్యావరణ అనుమతులు పొందారా అని నిలదీసింది. జరిగిన నష్టాన్ని వెంటనే భర్తీ చేయాలని స్పష్టం చేసింది.
విచారణ సందర్భంగా కోర్టులో ప్రభుత్వ న్యాయవాది సింఘ్వి మాట్లాడుతూ భూమిపై ఎటువంటి ముఖ్యమైన పనులు చేపట్టలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ, పర్యావరణ నష్టాన్ని పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలపై స్పష్టమైన నివేదికను అందించాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో ప్రజా హక్కులు, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది కోర్టు. జూలై 23న కేసును తిరిగి విచారిస్తామని పేర్కొంది.