చెన్నై – తమిళనాడు సంచలన నిర్ణయం తీసుకుంది. బలవంతంగా అప్పులు వసూలు చేస్తే 5 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించేలా బిల్లును శాసన సభలో ప్రవేశ పెట్టింది. ఈ మేరకు గవర్నర్ రవి ఆమోదం తెలిపారు. ప్రజల వద్ద కొన్ని రుణ సంస్థలు బలవంతంగా రుణాలు వసూలు చేస్తున్నాయని, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు సీఎం ఎంకే స్టాలిన్. ఇలాంటి సంఘటనలు ఆపడానికే ఈ బిల్లు ప్రవేశ పెట్టామని స్పష్టం చేశారు .
ఇకపై ప్రజల వద్ద బలవంతంగా రుణాలు వసూలు చేసినా, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినా ఐదేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు ఎంకే స్టాలిన్. రుణ సంస్థల ఒత్తిడితో ఎవరైనా బలవన్మరణానికి పాల్పడితే, ఆ సంస్థ నిర్వాహకులకు బెయిల్ రాకుండా జైలు శిక్ష అమలు చేసే విధంగా ఈ బిల్లును రూపొందించడం జరిగిందన్నారు.
ఈ బిల్లుతో రుణ సంస్థలకు బిగ్ షాక్ తగిలింది. ఒక్క తమిళనాడులోనే కాదు దేశ వ్యాప్తంగా రాక్షసుల్లా వ్యవహరిస్తున్నాయి ఆర్థిక సంస్థలు. వీటిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పట్టు లేక పోవడం కూడా ప్రధాన కారణమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా రుణ సంస్థల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించడం జరిగిందని చెప్పారు సీఎం ఎంకే స్టాలిన్. వీటికి చెక్ పెట్టేందుకే ఈ బిల్లును ప్రత్యేకంగా తీసుకు వచ్చామన్నారు.