ప్ర‌భుత్వంపై కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యుద్దం

ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు..ఆందోళ‌న‌లు

హైద‌రాబాద్ – కాంగ్రెస్ స‌ర్కార్ నిర్వాకంపై భ‌గ్గుమంటున్నారు కాంట్రాక్టు ఎంప్లాయిస్. ఇప్ప‌టికే ప‌లుమార్లు త‌మ‌ను ఆదుకోవాల‌ని విన్న‌వించినా ప‌ట్టించు కోలేద‌ని వాపోతున్నారు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా మాయ మాట‌లు చెప్పార‌ని, ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పిస్తామంటూ హామీ ఇచ్చార‌ని ఆరోపించారు. నెల‌లు గ‌డిచినా జీతాలు చెల్లించ‌డం లేదంటూ మండిప‌డ్డారు. త‌మ న్యాయ ప‌ర‌మైన వేత‌నాల కోసం ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టు ఎంప్లాయిస్ జేఏసీ ప్ర‌క‌టించింది. సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

సకాలంలో జీతాలు చెల్లిస్తామనే కాంగ్రెస్ ప్రభుత్వ వాదనలకు విరుద్ధంగా, తెలంగాణలోని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఉద్యోగులకు గత రెండు నెలలుగా జీతాలు అందడం లేదన్నారు. మల్టీపర్పస్ కార్మికులు, గ్రామ పంచాయతీలలోని కంప్యూటర్ ఆపరేటర్లు, మండల ప్ర‌జా ప‌రిష‌త్ కార్యాలయాల్లోని ఉద్యోగులు సహా బాధిత సిబ్బంది హైదరాబాద్‌లోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళ‌న చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న 92,000 మందికి పైగా ఉద్యోగులు – గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘంతో సంబంధం ఉన్నవారు కూడా సంక్షోభంలో చిక్కుకున్నారు. వారి చివరి జీతం ఏప్రిల్‌లో జమ చేశార‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు జీతాలు అంద‌లేద‌న్నారు.

Comments (0)
Add Comment