స్వ‌చ్చంధ సంస్థ‌ల‌తో ప్ర‌భుత్వం ఒప్పందం

ప్ర‌భుత్వ బ‌డుల్లో విద్యా ప్ర‌మాణాల పెంపు కోసం

హైద‌రాబాద్ – దేశంలోని 6 ప్రముఖ NGOలతో తెలంగాణ‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగు పరచడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందచేయ‌నున్నాయి. ఈ సంస్థ‌ల ద్వారా నీట్, యూపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులు శిక్ష‌ణ పొంద‌నున్నారు.

ఒప్పందంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా సౌకర్యాలను మెరుగు ప‌రిచేందుకు గాను రాష్ట్ర విద్యా శాఖ సీఎం ఎ. రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో ప్ర‌ముఖ స్వ‌చ్చంధ సంస్థ‌ల‌తో అవ‌గాహ‌న ఒప్పందం చేసుకుంది. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా NGOలు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించ‌నున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన Ed Tech సౌకర్యాలను అందించడానికి ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 6 ప్రసిద్ధ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవ‌డం విశేషం. నందన్ నీలేకని నేతృత్వంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నిర్వహిస్తున్న ప్రజ్వాలా ఫౌండేషన్, అలక్ పాండే ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్ దార్ నేతృత్వంలోని పై జామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఎడ్యుకేట్ గర్ల్స్ అనేవి ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా నాణ్యమైన విద్యను అందించడంలో తమ నైపుణ్యాన్ని అందించడానికి ముందుకు వ‌చ్చాయి ఈ సంస్థ‌లు.

ప్ర‌జా ప్ర‌భుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ముగ్ధులై, ఈ సంస్థలు ముందుకు వచ్చి ప్రభుత్వంతో చేతులు కలిపాయి. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగు పరచాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ప్రముఖ సంస్థల సహాయం కోరాలనే నిర్ణయం తీసుకోబడింది. భారతదేశంలోని ప్రఖ్యాత సంస్థలతో భాగస్వామ్యం దేశంలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకువస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తుంది.

Comments (0)
Add Comment