హైదరాబాద్ – మైనింగ్ కింగ్ గా పేరు పొందిన గాలి జనార్దన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ కేసులో జైలు పాలైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. బుధవారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వాదనలు విన్న అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్ల రాదని ఆదేశించింది. రూ. 10 లక్షల పూచీకత్తు చెల్లించాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా గత మే 6న సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
గాలికి ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. అయితే ఇదే కేసులో ముద్దాయిగా ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇవ్వడంపై సీబీఐ మండిపడింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గాలి జనార్దన్ రెడ్డి గెలుపొందారు. గాలితో పాటు ఓఎంసీ ఎండీ బీవీ శ్రీనివాస్ రెడ్డి,
మాజీ ఏపీ గనులు, భూగర్భ శాఖ డైరెక్టర్ వీడి రాజగోపాల్ , జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెహఫుజ్ అలీ ఖాన్ లకు కూడా బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ప్రతి ఒక్కరు రూ. 10 లక్షల చొప్పున చెల్లించాలని స్పష్టం చేసింది కోర్టు.
ఇదిలా ఉండగా మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై సంచలన తీర్పు వెలువరించడంతో శాసన సభ స్పీకర్ తన శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఇదే సమయంలో తను ప్రాతినిధ్యం వహించే శాసన సభ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.