అమరావతి – గోదావరి జలాల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మరోసారి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తాము సముద్రంలోకి వృధాగా పోయే నీటిని మాత్రమే వాడుకుంటామని ఇప్పటికే స్పష్టం చేశామన్నారు. ప్రస్తుత సర్కార్ కూడా ఆమోదం తెలిపిందన్నారు. కొందరు కావాలనే దీనిని రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. తాము పక్క రాష్ట్రంతో గొడవ పెట్టుకోవాలని అనుకోవడం లేదన్నారు సీఎం.
బనకచర్ల వల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. గోదావరి మిగులు జలాలు రెండు రాష్ట్రాలూ వాడుకోవచ్చని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయని పేర్కొన్నారు. ఎంతగా వాడుకున్న 200 టీఎంసీలు మాత్రమే వాడుకోగలమని అంతకు మించి ఎక్కువ వాడుకున్నా వేస్ట్ అవుతాయంటూ చిలుక పలుకులు పలికారు.
బనకచర్ల వద్ద ఎవరికీ ఇబ్బంది లేదన్నారు నారా చంద్రబాబు నాయుడు. గోదావరి జలాల వినియోగంతో 2 రాష్ట్రాలు బాగు పడతాయని చెప్పారు. రాయలసీమను హర్టీకల్చర్ హబ్గా మారుస్తామని ప్రకటించారు. కోస్తాంధ్రను ఆక్వా కల్చర్ హబ్గా మారుస్తామన్నారు. ప్రజలపై ధరల భారం పడకుండా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని చెప్పారు సీఎం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. అదే రోజున ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం చేస్తామన్నారు.