తిరుమల – టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది టీటీడీ . శ్రీవారి ఆలయంలో తరతరాలుగా వస్తున్న వేద పారాయణానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని పేర్కొనడం దారుణమని తెలిపింది. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో వేద పారాయణాన్ని పఠించే సమయాన్ని గతం కన్నా మరింత పెంచడమే కాకుండా ప్రస్తుతం పూర్తిస్థాయిలో స్థిరీకరించడం కూడా జరిగిందని స్పష్టం చేసింది.
శ్రీవారి ఆలయంలో గానీ, వెలుపల గానీ, ఉభయ కాలిబాట మార్గాల్లో, కళ్యాణ కట్ట, శ్రీవారి సేవ, బయట క్యూలైన్లు, వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం తదితర ప్రాంతాల్లో కూడా ఒక సంవత్సర కాలంగా ఓం నమో వేంకటేశాయ నామాన్ని అన్ని చోట్లా ప్రతిధ్వన్వించేలా ఏర్పాటు చేశామని వెల్లడించింది.వేద పాఠశాలల్లో వేద విద్యార్థులకు శారీరక, మానసిక దృఢత్వం పెంచే విధంగా కూడా చర్యలు చేపడుతున్నామని తెలిపింది.
అర్చకులకు ఇచ్చే గౌరవంలో ఎలాంటి లోటుపాట్లు లేవని స్పష్టం చేసింది టీటీడీ. వారికి ఇచ్చే గౌరవం వారికి ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆలయం లోపల ఇటీవల కాలంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని తెలిపింది. ఆలయం లోపల కూడా భక్తుల నుండి దర్శనాలు, తీర్థ ప్రసాదాలు, తదితర అంశాలపై అభిప్రాయ సేకరణ విధానాన్ని ప్రారంభించి పారదర్శకతకు పెద్దపీట వేశామని, ఈ విధానంపై భక్తుల నుండి ప్రశంసలు అందుతున్నాయని స్పష్టం చేసింది.
గతంలో టీటీడీ కేటాయించిన స్థలానికన్నా ఎక్కువ స్థలం ఆక్రమించి నిర్మాణం చేపట్టినందుకు కోర్టు ఆదేశాలు ప్రకారం విశాఖ శారదా పీఠం, మరో ఒకటి రెండు మఠాలపై నోటీసులు జారీ చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని పేర్కొంది టీటీడీ..