తిరుమల -తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక తీర్మానం చేసింది. ఈ మేరకు రేణిగుంట విమానాశ్రయం పేరును ‘శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయం’గా మార్చాలని సిఫార్సు చేయాలని నిర్ణయించింది. ఇది దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను కలిగి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రతీకగా మారుతుందని పేర్కొంది .
పాలక మండలి కీలక సమావేశం జరిగింది. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి వెల్లడించారు టీటీడీ ఆలయ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామల రావు. శ్రీవారి పేరు రేణిగుంట ఎయిర్ పోర్టుకు పెట్టే ప్రతిపాదనను త్వరలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సమర్పించనున్నట్లు తెలిపారు. కొత్త పేరు విమానాశ్రయానికి విలక్షణమైన ఆధ్యాత్మిక, ఐకానిక్ గుర్తింపును ఇస్తుందని, యాత్రికుల అనుభవాన్ని పెంచుతుందని బోర్డు నమ్ముతోందన్నారు.
ఇదిలా ఉండగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరులో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని కోరారని, ఇందుకు గాను స్థలం కేటాయిస్తే టీటీడీ వెంటనే నిర్మాణం చేపట్టనుందని తెలిపారు బీఆర్ నాయుడు.
పర్యావరణ అనుకూల ప్రయత్నాలను బలోపేతం చేస్తూ కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి సహకారంతో టిటిడి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుండి 100 ఎలక్ట్రిక్ బస్సులను వాడనుందని తెలిపారు. డిమాండ్, కార్యాచరణ సాధ్యాసాధ్యాలను బట్టి తిరుపతి, తిరుమల అంతటా యాత్రికుల రవాణా అవసరాలను ఈ బస్సులు తీరుస్తాయన్నారు.
పవిత్ర ప్రసాదాల నాణ్యతా ప్రమాణాలను నిలబెట్టడానికి, బోర్డు శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్ఐఆర్) ప్రయోగశాలను ఏర్పాటు చేయడానికి తిరుపతిలో 30 ఎకరాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. కొండ ఆలయంలో ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యి, నీరు , ఇతర పదార్థాల వంటి ముఖ్యమైన వస్తువులను ఈ ల్యాబ్ పరీక్షిస్తుందన్నారు.