బెంగళూరు – కేంద్ర మంత్రి కుమార స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. సరైన ఏర్పాట్లు చేయలేదని, పూర్తిగా బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించిందని ఆరోపించారు. దీనికి మొత్తం బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి.
అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. కుమార స్వామి మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా 18 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాటా ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2025 కప్ ను కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టును 6 పరుగుల తేడాతో ఓడించింది.
ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్సీబీ జట్టుకు ఘన స్వాగతం పలికింది. ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జట్టుకు విజయోత్సవ సన్మాన, సభా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతకు ముందు విధాన సభ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు పరేడ్ నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ఇసుక వేస్తే రాలనంత రావడంతో లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయలేక పోయారు. 5 వేల మంది పోలీసులు ఉన్నా పలువురు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు.