ఎవరీ పింగళి చైతన్య అనుకుంటున్నారా. తను రచయిత్రి. తన తండ్రి ఎవరో కాదు ఎన్ కౌంటర్ పత్రికతో రాజకీయ నేతల్లో రైళ్లు పరుగెత్తించిన పింగళి దశరథరామ్. తన తాత భారత దేశానికి గర్వ కారణంగా నిలిచిన జాతీయ పతాకం (మువ్వొన్నెల జెండా) రూపశల్పి పింగళి వెంకయ్య. తను ఇప్పుడు సంచలనంగా మారారు. గేయ , కథా రచయిత్రి కూడా. ఆ మధ్యన రమణమూర్తి విజయ విహారం పత్రికలో తను వరుసగా వివిధ అంశాలపై రాసింది. పేరు తెచ్చుకుంది. తాజాగా శేఖర్ కమ్ముల తీసిన కుబేర మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో భిక్షగాడి పాత్రలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించగా సీబీఐ ఆఫీసర్ గా అక్కినేని నాగార్జున నటించారు. ప్రధానంగా ధనుష్ పాత్రకు పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి.
మరి ఈ కుబేర చిత్రానికి కథ రాసింది పింగళి చైతన్య. సినిమా రచయిత్రిగా గుర్తింపు పొందింది. తన జీవిత భాగస్వామి బాల గంగాదర తిలక్. 2016లో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని అందుకున్నారు. చిట్టగాంగ్ విప్లవ వనితలు అనే కథల సంపుటి సంచలనం సృష్టించింది. ప్రయోగాత్మక కథా రచనలో పేరు పొందింది. తను విజయవాడలో పుట్టింది. కోదాడకు దగ్గరలో ఉన్న నందిగామలో పెరిగింది. తన తండ్రి నిఖార్సయిన సోషలిస్టు. చిన్నప్పుడే తను హత్యకు గురయ్యాడు. తను మనసులో వెన్నెల అనే రచన చేశారు.
ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించారు దర్శకుడు శేఖర్ కమ్ముల ద్వారా. వరుణ్ తేజ్ , సాయి పల్లవి నటించిన ఫిదా బిగ్ సక్సెస్. ఈ సినిమాకు కో రైటర్ గా పని చేశారు పింగళి చైతన్య. ఊసు కోదు ఊసుకోదు, ఫిదా ఫిదా అనే పాటలు రాసింది. నేల టికెట్ సినిమాలో బిజిలి, విన్నానులే పాటలు, లవ్ స్టోరీ మూవీలో ఏయ్ పిల్లా, మసూద చిత్రంలో దాచి దాచి వంటి పాటలు రాసింది. హృదయాలను దోచుకుంది. 2024లో వచ్చిన షరతులు వర్తిస్తాయి సినిమాలో ఆకాశం అందని పాటను ఇప్పటికీ ఆదరిస్తున్నారు. కుబేర చిత్రానికి కథ రాయడంతో మరోసారి సంచలనంగా మారారు వర్దమాన రచయిత్రి.