ప్ర‌జ‌ల స‌హ‌కారం వ‌ల్ల‌నే యోగా డే సూప‌ర్ హిట్

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు

విశాఖ‌పట్నం – ప్ర‌జ‌లంద‌రి స‌హ‌కారం వ‌ల్ల‌నే యోగా డే సూప‌ర్ హిట్ అయ్యింద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే అవకాశమిచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నామ‌ని తెలిపారు. ఆనాడు దీపావళి వద్దంటే మానేశారని, నేడు యోగాడేకి రమ్మంటే తరలి వచ్చారన్నారు. రోజూ గంట పాటు యోగా చేస్తే చాల‌ని, ఎలాంటి రోగాలు రావ‌న్నారు. సూర్య న‌మ‌స్కారంతో గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన గిరిజ‌న విద్యార్థుల‌ను ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నాన‌ని చెప్పారు.

శ‌నివారం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడారు. ఆర్గానిక్ ఆహారం తీసుకుంటే ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి రాదన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ సమానంగా అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామ‌ని చెప్పారు.
విజయవంతం చేసేందుకు కృషి చేసిన మంత్రులు, అధికారులకు సీఎం ప్రశంసించారు. కార్యక్రమం నిర్వహణకు ప్రకృతి సహకరించడంతో పాటు వరుణ దేవుడు కూడా కరుణించాడని అన్నారు. యోగా చేయాలనుకున్న చోటుకు 3,03,654 మంది క్యూఆర్ కోడ్ తో వచ్చారని వెల్లడించారు.

ఒకే వేదిక వద్ద 3 లక్షల మందికి పైగా యోగా చేయటం, 22,122 మంది గిరజన విద్యార్థులు 108 నిమిషాల పాటు చేసిన సూర్య నమస్కారాలతో రెండు గిన్నీస్ రికార్డులు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించామని చెప్పారు చంద్ర‌బాబు నాయుడు. యోగా డే లో పాల్గొనేందుకు 2.45 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 20 లక్షల మందికి ధృవపత్రాలు ఇవ్వాలనుకున్నాం కానీ 1.80 లక్షల దాకా సర్టిఫికేట్లు తీసుకుంటున్నారని తెలిపారు.

యోగా పట్ల ప్రజల్లో అవగాహన లేకపోయినా, లాభం లేదని భావించినా కార్యక్రమానికి రారని అన్నారు.. యోగాతో ఉపయోగం ఉందని భావించటం వల్లే తెల్లవారు ఝామున 2 గంటల నుంచి రావడం ప్రారంభించారని పేర్కొన్నారు. పదేళ్లుగా ప్రధాని మోదీ చేసిన కృషి ఫలించిందన్నారు. 170 దేశాల్లో యోగాను ఆచరిస్తున్నారని తెలిపారు. ఇవాళ ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షల చోట్ల 10 కోట్ల మంది ప్రజలు యోగాలో భాగస్వామ్యయ్యారని పేర్కొన్నారు. యోగా కొందరిది కాదు..అందరిదీ. యోగా ప్రతీ ఒక్కరికీ అవసరమే అనే భావనను ప్రధాని మోదీ తీసుకొచ్చార‌ని కొనియాడారు.

Comments (0)
Add Comment