విశాఖపట్నం – అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదేనని అన్నారు ప్రధాని మోదీ. యోగా డే సందర్బంగా విశాఖ నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవన శైలిని యోగా మార్చేసిందన్నారు. యోగా విశ్వవ్యాప్తం కావడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఇవాళ మనం ప్రవేశ పెట్టిన యోగాను 175 దేశాలు అనుసరిస్తున్నాయని, ఇదంతా భారత్ సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు. మొత్తంగా యోగా యావత్ ప్రపంచాన్ని ఏకం చేసిందన్నారు. ప్రతి ఒక్కరు ప్రతి రోజూ క్రమం తప్పకుండా యోగాను సాధన చేయాలని పిలుపునిచ్చారు నరేంద్ర దామోదర దాస్ మోదీజీ.
దేశంలో భారతీయ జనతా పార్టీ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువు తీరడంతో పూర్తిగా యోగాకు ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేశారు. ఈ ఘనత మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీనేనని చెప్పక తప్పదు. గత 10 ఏళ్లుగా యోగాను విశ్వ వ్యాప్తం చేయడంలో పీఎం కీలక పాత్ర పోషించారు. ఎక్కడికి వెళ్లినా యోగా చేయాలని కోరారు. దానికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం జూన్ 21న నిర్వహిస్తున్న ఈ యోగా డే 11వ అంతర్జాతీయ దినోత్సవం కావడం విశేషం.
ఈసారి ఏపీ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించిన యోగా కార్యక్రమంలో తాను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 5 లక్షల మందితో విశాఖ ఆర్కే బీచ్ నుంచి నగరం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా జరిగిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ ప్రసంగించారు. యోగా గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు.