అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ సీఎం చంద్రబాబును ఏకి పారేశారు. సూపర్ సిక్స్ పూర్తిగా అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. చంద్రబాబు నాలుకకు మందం ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ కాదని ఇది ట్రబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ఫైర్ అయ్యారు. ప్రజలను హామీల పేరుతో మోసం చేస్తున్నది మీరు కాదా అని ప్రశ్నించారు. ఏం సాధించారని విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.
ఎన్నికల ముందు మహిళా శక్తి పథకాన్ని P4 లో కలుపుతామని ఎందుకు చెప్పలేదంఊట నిలదీశారు వైఎస్ షర్మిల. రక్తం రుచి మరిగిన పులి కూడా ఒక్కోసారి ఇతర జీవాల పట్ల జాలి కురిపిస్తుందని, కానీ జగన్ రెడ్డికి అలాంటిది ఏకోశాన లేదన్నారు. ఆయనకు మానవత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తన గురించి కామెంట్స్ చేయడం తన అజెండా కాదన్నారు. 5 ఏళ్లు మద్యం స్కాం చేసి.. ఇప్పుడు జనాల మధ్యకు రావడం విడ్డూరంగా ఉందన్నారు షర్మిల.
ధనం ఉందని బల ప్రదర్శన చేస్తే ఎలా అని ఫైర్ అయ్యారు జగన్ రెడ్డిపై. పోరాటాలు చేసే నాకు అనుమతి ఇవ్వడం లేదు కానీ వాహనాల కింద మనుషులను చంపుకుంటూ పోయే వైసీపీకి ఎలా అనుమతి ఇచ్చారో ఏపీ సర్కార్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నది కూటమి పాలన కానే కాదని టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలన్నీ బీజేపీ పార్టీలేనంటూ మండిపడ్డారు.