తిరుమల – తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. ఎక్కడ చూసినా భక్తులతోనే నిండి పోయింది. గోవిందా గోవిందా శ్రీనివాస గోవిందా, ఆపద మొక్కుల వాడా గోవిందా అంటూ భక్తులు నిత్య స్మరణతో మారుమ్రోగుతోంది. ఈ సందర్బంగా ప్రతి రోజూ కనీసం 80 వేల మందికి పైగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకుంటున్నారు.
వేలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ కృషి చేస్తోందని చెప్పారు ఈవో జె. శ్యామల రావు. ఈ మే నెలలో ఏకంగా 51 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశామన్నారు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్లలో మరో 20 లక్షల మందికి పాలు, టీ, కాఫీ, మజ్జిగ, స్నాక్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. మే నుంచి ప్రతిరోజూ సగటున 2.5 లక్షల అన్నప్రసాదాలు, 90 వేలకు పైగా అల్పాహారాలు, పానీయాలు అందిస్తున్నామని తెలిపారు.
మే 24న ఒక్కరోజే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 93,950 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు వెల్లడించారు. అదే రోజు బయట క్యూలైన్లు, వైకుంఠం ప్రాంతాల్లో 2.72 లక్షల అన్నప్రసాదాలు, 1.17 లక్షల పానీయాలు అందించినట్లు పేర్కొన్నారు.
క్యూలైన్లలో నిరంతరాయంగా తాగునీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రతను ఆరోగ్యశాఖ నిర్వహిస్తోందన్నారు. మొత్తం 2,150 మంది శానిటరీ కార్మికులు, సూపర్వైజర్లు, మైస్త్రీలు, ఇన్స్పెక్టర్లు, యూనిట్ అధికారులు భక్తుల కోసం 24 గంటలు సేవలు అందిస్తున్నారని తెలిపారు.
