అమరావతి – ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా యోగా డేను ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనుంది. విశాఖ కేంద్రంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. 2 కోట్ల మంది ఆ రోజు యోగా దినోత్సవంలో పాల్గొంటారని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీని ప్రపంచ పటంలో పెట్టేందుకు చేపట్టిన ఉద్యమమని పేర్కొన్నారు. లక్ష చోట్ల యోగా డే సన్నద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే యోగా లాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. సచివాలయంలో యోగా డే నిర్వహణపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. లా అండ్ ఆర్డర్ పై పూర్తిగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం అమలు చేశామని అన్నారు.. చెప్పిన మాట ప్రకారం ఎంతమంది ఉన్నా పథకం వర్తింపజేస్తామని చెప్పి ఇచ్చామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా యోగా డే కార్యక్రమం సందర్భంగా పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని , ఇది చరిత్రలో నిలిచి పోతుందన్నారు. పాల్గొనే ప్రతి ఒక్కరికీ యోగా సర్టిఫికెట్ ఇస్తామన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.