బాధిత మ‌హిళ‌కు చంద్ర‌బాబు భ‌రోసా

రూ. 5 ల‌క్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌ట‌న

అమ‌రావ‌తి – చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషతో సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఫోన్‌లో మాట్లాడి శిరీషను పరామర్శించి, ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా అని అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బందిపెట్టారని ఆమె చెప్పారు.

ఈ ఘటనలో పిల్లలు, తాను భయపడుతున్నామని ముఖ్యమంత్రికి బాధితురాలు గోడు వెళ్లబోసుకుంది. ఇటువంటి ఘటన దురదృష్ణకరమని, ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని సిఎం స్పష్టం చేశారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని సిఎం అన్నారు. శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. వారిని బాగా చదివించాల‌ని సూచించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు ముఖ్య‌మంత్రి.

అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలను చదివించు కోవడానికి ఇబ్బంది పడుతున్న శిరీష పరిస్థితిని తెలుసుకున్న నారా చంద్ర‌బాబు నాయుడు…అప్పటికప్పుడు ఆమెకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని శిరీషకు ఫోన్‌లో సిఎం హామీ ఇచ్చారు. ఘటన, తదనంతర పరిణామాలపై తనకు నివేదిక ఇవ్వాలని, బాధిత కుటుంబానికి అందుబాటులో ఉండి అవసరమైన సాయం పూర్తిగా అందేలా చూడాలని చంద్ర‌బాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండ‌గా ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com