అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఆయా పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఏపీ వ్యవహరిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. దీనిపై తీవ్రంగా స్పందించారు చంద్రబాబు. తనకు తెలంగాణ , ఏపీ రాష్ట్రాలు రెండు కళ్లు లాంటివన్నారు.
తన వల్లనే తెలంగాణ అభివృద్ది చెందిందని మరోసారి పేర్కొన్నారు సీఎం. తెలంగాణతో నేను ఎప్పుడైనా గొడవ పడ్డానా? వాళ్లతో పోరాటం ఎందుకు అని ప్రశ్నించారు. కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులన్నీ కట్టుకోండి.. మిగిలిన నీటినే వాడుకుంటామని స్పస్టం చేశారు చంద్రబాబు నాయుడు. ప్రాజెక్టుల విషయంలో తెలంగాణతో పోరాటం చేయనని చెప్పారు.
బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటాలు అవసరం లేదన్నారు. ఎవరి నీళ్లు వారివేనని పేర్కొన్నారు చంద్రబాబు.. అవసరమైతే ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుందామని అన్నారు. సముద్రంలోకి పోయే నీటిని ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో వాడుకుందామని మాత్రమే ఇప్పటి వరకు స్పష్టం చేస్తూ వచ్చామన్నారు. 1000 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయని, అందుకే తాము వాటిని బనకచర్ల కోసం వాడుకుంటామని చెప్పామన్నారు. ఇందులో తప్పేముందంటూ ప్రశ్నించారు.