ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నీటి వనరులను దోచుకు వెళ్లేందుకు ప్లాన్ చేసిన చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ బనకచర్ల ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో ఉందంటూ పేర్కొనడం విస్తు పోయేలా చేసింది. ఇది కర్నూల్ జిల్లాలో ఉంది. ఇది రిజర్వాయర్ అంటూ చెప్పడం, బొల్లపల్లి రిజర్వాయర్ ను రెగ్యులేటర్ అంటూ పేర్కొనడంపై తెలంగాణవాదులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బనకచర్ల గోదావరి లింక్ ప్రాజెక్టులో ఒక భాగం. కర్నూల్ తో సహా రాయలసీమకు గోదావరి నీటిని ఎత్తుకెళ్లాలని ప్రయత్నం చేస్తోంది ఏపీ.
దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఉమ్మడి ఏపీకి సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఆ ప్రాంత ప్రయోజనాలకు పెద్దపీట వేశాడు. అంతే కాదు తెలంగాణను ఎడారిగా మార్చేశాడు. ఆయన ఉన్న కాలంలో ఈ ప్రాంతం తీవ్రమైన కరువుకు, వివక్షకు లోనైంది. గత 10 ఏళ్లుగా కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఇక్కడ కాలు పెట్టాలంటేనే భయపడ్డాడు. కానీ ఊహించని రీతిలో తన శిష్యుడు ఎ. రేవంత్ రెడ్డి సీఎంగా కొలువు తీరడంతో మెల మెల్లగా కుట్రలకు తెర లేపాడు.
ఆపై తెలంగాణ ప్రాంతానికి ఎండబెట్టి గోదావరి నీటిని మళ్లించుకు పోయేందుకు బనకచర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం తన మద్దతుతో కేంద్రంలో మోదీ సర్కార్ ఉండడంతో దానిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా పనులు చేసుకుంటూ పోతున్నాడని బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చివరకు మాజీ మంత్రి హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో గత్యంతరం లేక నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై అభ్యంతరం తెలియ చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు.