అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. భవన నిర్మాణదారులకు మేలు చేకూర్చేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. రాష్ట్రంలో భవన నిర్మాణాల నిబంధనల్లో మరిన్ని సడలింపులకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. కేవలం ఒక్క రూపాయి ఫీజుతో 50 చ.మీ. విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
కాగా 3 మీటర్ల ఎత్తు దాటిన భవనాలకు 1.5 మీటర్ల వెడల్పుతో బాల్కనీలు నిర్మించు కునేందుకు అనుమతి ఇస్తామన్నారు. 9 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్ల లో కూడా రెడ్ కేటగిరీ మినహా ఇతర పరిశ్రమలకు
కూడా పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. చిన్న చిన్న ప్లాట్లలో ఉమ్మడిగా ఉండే చోట కొన్ని సడలింపులు చేశామన్నారు మంత్రి పొంగూరు నారాయణ.
100 చ.మీటర్ల ప్లాట్ కు 2 మీ. వెడల్పు గల అంతర్గత రోడ్డు,100 చ.మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లకు 3.6 మీటర్ల వెడల్పు గల అంతర్గత రోడ్డు ఉంటే సరిపోతుందన్నారు. 100 చ.మీ.లోపు ప్లాట్లకు ఆల్ రౌండ్ సెట్ బ్యాక్ లు అవసరం లేదన్నారు. 300 చ.మీ.కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు సెల్లార్ పార్కింగ్ కు అనుమతి ఇస్తామన్నారు మంత్రి. ల్యాండ్ పూలింగ్ నిబంధనలు – 2025 ను నోటిఫై చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. ప్రస్తుతం అమరావతిలో 10 వేల మంది కార్మికులు పని చేస్తున్నారని వెల్లడించారు.
