అమరావతి – ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తీపికబురు చెప్పింది. ఈ మేరకు 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో టాప్ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు పురస్కారాలను ఇవ్వనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. షైనింగ్ స్టార్స్ పేరుతో అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 9న జిల్లా కలెక్టర్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో పురస్కారాలను ప్రదానోత్సవం చేయనున్నారు.
2024-25 విద్యా సంవత్సరానికి అవార్డులు ఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అవార్డులో రూ. 20 వేల నగదు, మెడల్, అప్రిషియేషన్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. 10వ తరగతి 500 మార్కులు పైబడి వచ్చిన విద్యార్థులకు, ఇంటర్మీడియట్ 830 మార్కులు పైబడి వచ్చిన విద్యార్థులకు వీటిని అందజేస్తారు.
వివిధ మండలాల్లో 10వ తరగతి, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి షైనింగ్ స్టార్ అవార్డులు ఇస్తామని వెల్లడించారు నారా లోకేష్. ఈ మేరకు విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
OC, BC, SC, ST , మైనారిటీ విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి మండలంలో 6 మంది విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేస్తారు. ఇద్దరు OC, ఇద్దరు BC, ఒక SC, ఒక ST విద్యార్థికి అవార్డులు ప్రదానం చేస్తారు.