అమరావతి: డబుల్ ఇంజిన్ సర్కారు అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో చూపించామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047ను లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆయన.. అన్నీ చేసేశామని చెప్పట్లేదని, ఊహించిన దానికంటే ఎక్కువే చేశామని అన్నారు. ఏడాది పాలన సందర్భంగా అమరావతిలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం పదవి తనకు కొత్తకాదని.. నాలుగుసార్లు సీఎం అయినట్లు గుర్తు చేశారు. ప్రతిసారీ సమర్థంగా పరిపాలించి సుపరిపాలన అందించానన్నారు.
మూడు పార్టీలు కలిసి అధికారంలో ఉన్నా ఎలాంటి సమస్య రాలేదని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెప్పిన మాట నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. సుపరిపాలన అందించేందుకు అధికారులు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వ విధానాలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయిందన్నారు.
మూడు రాజధానుల నమూనాతో రాష్ట్ర అభివృద్ధి కుంటు పడిందన్నారు. మూడు ముక్కలాటతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆరోపించారు. పోలవరం పూర్తయితే రాష్ట్రానికి నీటి సమస్య సమసి పోతుందన్నారు. 2022-23కు నీతిఆయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందని, వైకాపా హయాంలో నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని ఆరోపించారు సీఎం.
అధికారంలోకి రాగానే నాలుగు సంతకాలు పెట్టానని తెలిపారు . మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. వైకాపా హయాంలో రెవెన్యూ రికార్డులను అస్తవ్యస్థం చేశారు. వాటిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 213 అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం పెడుతున్నామని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.11,400 కోట్లు సాయం చేసిందన్నారు. అమరావతిని మళ్లీ పట్టాలెక్కించామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,500 కోట్లు కేటాయించారని, విశాఖ రైల్వే జోన్ పనులు జరుగుతున్నాయని అన్నారు. ‘తల్లికి వందనం’ హమీని పూర్తిగా నిలబెట్టుకున్నాం. అడ్మిషన్లు పూర్తయ్యాక ఒకటో తరగతి, ఇంటర్ విద్యార్థులకూ ఇస్తామన్నారు.