అమరావతి – ఓ వైపు బనకచర్ల విషయంపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం తెలపడం పట్ల స్పందించారు మంత్రి నిమ్మల రామానాయుడు. దీనిని చేపట్టడం వల్ల ఎలాంటి నష్టం జరగదన్నారు. సీడబ్ల్యూసీ పర్మిషన్ ఇచ్చాకే డీపీఆర్ పూర్తి చేస్తామన్నారు. తమ నాయకుడు, సీఎం చంద్రబాబుకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లు లాంటివన్నారు. పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమ స్వలాభం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్రాలుగా విడి పోయినా తెలుగు వారంతా ఒక్కటేనని అన్నారు.
నికర జలాలను బనకచర్ల ప్రాజెక్టు కోసం వాడడం లేదని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. తెలంగాణ ప్రాజెక్టులను ఏనాడూ అడ్డుకోలేదన్నారు. ఇది గ్రహించాలని కోరారు. నీటి చట్టం ప్రకారం పైన ఉన్న నీళ్లు దిగువకు వదలాలని ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు తెలంగాణకు కూడా నీళ్లు రావాలని కోరుకున్నారని తెలిపారు. మంగళవారం సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధానంగా రాయలసీమ దాహార్తితో అలమటిస్తోందన్నారు.
ఇందుకోసమే తాము కరువు నివారణ కోసం సముద్రంలో వృధాగా కలుస్తున్న 200 టీఎంసీల నీటిని వాడుకునేందుకే బనకచర్లకు శ్రీకారం చుట్టామన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎన్నో ప్రాజెక్టులను అనుమతి లేకుండానే చేపట్టలేదా అని ప్రశ్నించారు నిమ్మల రామానాయుడు. ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలపడం దారుణమన్నారు. ఇది మంచిది కాదన్నారు. గోదావరి వరదల వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఏపీకే ఏర్పడుతోందన్నారు.