అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా మారిందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. చిత్తూరు జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు, కార్యకర్తలు నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసేది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు ఈ సందర్బంగా వైఎస్ షర్మిల.
బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ ముగ్గురు బీజేపీకి ఊడిగం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తమ స్వలాభం కోసం, పదవులను కాపాడేందు కోసం ఏకంగా మోదీకి అడుగులు మడుగులు వత్తుతున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. బాబు, పవన్ మోడీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే జగన్ మోహన్ రెడ్డి తానేం తక్కువ కాదంటూ ఏకంగా పరోక్షంగా పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు.
ఈ ముగ్గురి వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రా హక్కు .. అలాంటి కంపెనీని తమ అనుయాయులకు ధారదత్తం చేసేందుకు ప్రయత్నం జరుగుతున్నా నేటి వరకు కూటమి సర్కార్ నోరు మెదపక పోవడం పట్ల మండిపడ్డారు.
రాష్ట్రంలో పేరుకు పోయిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేయడం లేదని, ఆరు గ్యారెంటీల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించిన సర్కార్ ఇప్పుడు నిద్ర పోతోందంటూ ధ్వజమెత్తారు వైఎస్ షర్మిలా రెడ్డి.