బెంగళూరు – ఐపీఎల్ కప్ గెలిచిన ఆనందం ఆర్సీబీకి దక్కలేదు. కర్ణాటక రాష్ట్ర సర్కార్ సన్మాన కార్యక్రమం విషాదం నింపేలా చేసింది. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తలపెట్టిన విజయోత్సవ పరేడ్, సభ పూర్తిగా అభాసు పాలైంది. పలు విమర్శలకు దారి తీసేలా చేసింది. ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత టాటా ఐపీఎల్ 2025 ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సందర్బంగా భారీ ఎత్తున గ్రాండ్ వెల్ కం చెప్పాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. కానీ ఎవరూ ఊహించని రీతిలో కన్నడిగులు పెద్ద ఎత్తున చిన్న స్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు. స్టేడియం కెపాసిటీకి మించి హాజరయ్యారు.
ఒకే ద్వారం నుంచి పంపించడంతో తీవ్రమైన తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ మొత్తం ఘటనలో ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ఇప్పుడు సమీప ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి పూర్తిగా సర్కార్ బాధ్యత వహించాలని అన్నారు కేంద్ర మంత్రులు హెచ్ డీ కుమార స్వామి, గంగాపురం కిషన్ రెడ్డి, బీజేపీ ఎల్ఓసీ నేత అశోక. వెంటనే సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ , హోం శాఖ మంత్రి జి. పరమేశ్వర తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్సీబీ ప్రోగ్రాంకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. సన్మాన కార్యక్రమానికి ఎవరైనా రావచ్చని తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. 5 వేల మందికి పైగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా లక్ష మందికి పైగా హాజరు కావడంతో చేతులెత్తేశారు. దీంతో స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఒకరిపై మరొకరు పడి పోయారు. భారీగా తోపులాట చోటు చేసుకుంది. చాలా మంది ఊపిరి ఆడక అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ప్రారంభంలో పాస్ లు జారీ చేస్తామని చెప్పారు. కొందరికే దక్కాయి. ఆ తర్వాత అందరికీ ఫ్రీ అంటూ ప్రకటించడంతో ఒక్కసారిగా దూసుకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఈ ఘటన చోటు చేసుకుంది.