హైదరాబాద్ – బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరమ్ కన్వీనర్ , మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ టి. చిరంజీవులు సీరియస్ కామెంట్స్ చేశారు. బీజేపీ కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందన్నారు. ఇది పూర్తిగా మోసం తప్ప చేసింది ఏముందంటూ ప్రశ్నించారు. మంగళవారం చిరంజీవులు మీడియాతో మాట్లాడారు. బీజేపీ పార్టీ బీసీలను తక్కువ చూపు చూసిందని, ఆశలు కలిగించి తరువాత అవమానించే వైఖరిని అనుసరిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అని ప్రకటించారు. కానీ, ఇది ఒక చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయం కాకుండా, ఓట్ల కోసం వేసిన రాజకీయ మాయాజాలమేనని బీసీలు గుర్తించారన్నారు. ఎందుకంటే, ముందే ఎవ్వరూ అడగకుండానే అలాంటి ప్రకటన చేయడం అనేది ఓటర్లను మభ్యపెట్టే చర్య తప్ప మరోటి కాదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన నాయకుడి స్థానాన్ని అగ్రకుల నేతకే అప్పగించడం ద్వారా పార్టీ అసలైన వైఖరిని చూపించిందన్నారు.
ఎన్నికల తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కూడా బీసీకి ఇవ్వకుండా మళ్ళీ అగ్రకుల నాయకునికే ఇచ్చారని ఆరోపించారు. బీసీల కులగణన విషయంలో కూడా బీజేపీకి స్పష్టత లేదన్నారు. 2018 లొ గణన చేస్తామని చెప్పి, 2022 లో సుప్రీంకోర్టులో తాము కుల గణన చేయమంటూ అఫిడవిట్ దాఖలు చేసిన విషయం మరిచి పోలేదన్నారు.
బీసీల ఆకాంక్షలను గౌరవించకుండా, వాయిదాలు వేస్తూ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ పంపిన రెండు బిల్లులను కేంద్ర బీజేపీ ప్రభుత్వం మూడు నెలలుగా ఆమోదించకుండా పెండింగ్లో పెట్టిందన్నారు.