హైదరాబాద్ – రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇదే వ్యవహారానికి సంబంధించి బాంబు పేల్చారు విచారణ ఎదుర్కొంటున్న మాజీ సీఐబీ (ఇంటెలిజెన్స్ చీఫ్ బ్యూరో ) ప్రభాకర్ రావు. విచారణ సందర్భంగా తాను కావాలని ఫోన్ ట్యాపింగ్ చేయలేదని, ఆనాడు డీజీపీగా పని చేసిన కేకే మహేందర్ రెడ్డి ఆదేశిస్తేనే తాను చేశానని చెప్పడంతో విచారణ అధికారులు నివ్వెర పోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మహేందర్ రెడ్డికి ఊహించని గిఫ్ట్ దక్కింది తెలంగాణ ఏర్పడిన తర్వాత.
ఆయనను అప్పటి సీఎం కేసీఆర్ ఏరికోరి సిటీ పోలీస్ కమిషనర్ గా నియమించారు. ఆయన సీపీగా ఉన్న సమయంలో ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు కలకలం రేపింది. జైలు పాలయ్యారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. ముఖ్యమంత్రిగా కొలువు తీరారు. ఆ తర్వాత మహేందర్ రెడ్డికి ప్రమోషన్ ఇచ్చారు కేసీఆర్. 2017లో రాష్ట్ర ఇంచార్జి డీజీపీగా నియమించారు. 2018 ఏప్రిల్ లో తనను పూర్తి స్థాయి డీజీపీగా నియమించారు.
ఇదే ఏడాది డిసెంబర్ లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో రెండవసారి కేసీఆర్ పవర్ లోకి వచ్చారు. ఇక మహేందర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. 2018 నుంచి 2022 వరకు డీజీపీగా ఉన్నారు. ఆనాడు ప్రతిపక్ష నేతలను, జర్నలిస్టులను, ఇతరులను తీవ్రంగా ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అనూహ్యంగా మహేందర్ రెడ్డికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఛాన్స్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ప్రభాకర్ రావు పేల్చిన బాంబు రాజకీయ వర్గాలను విస్తు పోయేలా చేసింది.