శాంతి స్థాప‌న‌లో బ్ర‌హ్మ‌కుమారీస్ కృషి ప్ర‌శంస‌నీయం

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస రెడ్డి

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా అనేక సమస్యలతో అశాంతి ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో సమాజంలో శాంతిని నెలకొల్పే బాధ్యతని మీడియా చేపట్టాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. కుల మతాల పేరిట విడిపోతున్న సమాజాన్ని ఐక్యత, సామరస్యత వైపు నడిపేందుకు మీడియా సంస్థలు, జర్నలిస్టులు అంకితమవ్వాలని ఆయన సూచించారు. ప్రగతి, ప్రశాంతత సమానంగా వృద్ధి చెందితేనే సామాజిక వికాసం జరుగుతుందని చెప్పారు.

బీబీనగర్ సమీపంలోని బ్రహ్మా కుమారీస్ సైలెన్స్ రిట్రీట్ సెంటర్లో ‘సామాజిక ఐక్యత, శాంతి స్థాపనలో మీడియా పాత్ర’ అనే అంశంపై జరిగిన సదస్సు- చర్చా వేదికలో శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్థిక అసమానతలు, సామాజిక విభేదాలను తొలగించటంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని స్ప‌ష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మా కుమారీస్ శాంతి స్థాపన కోసం అంకితభావంతో చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. కుల మత విభేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి సేవలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు.

పాత్రికేయ వృత్తికి సత్యత అతి ముఖ్యమని, దీని ద్వారానే జర్నలిస్టులు సమాజంలో విశ్వసనీయతను పొందుతారని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ప్రజా ప్రయోజనాలు, సామాజిక సంక్షేమాన్ని పరిరక్షించడానికి పాత్రికేయులు కట్టుబడి ఉండాలని సూచించారు. బ్రహ్మ కుమారీలు ఆధ్యాత్మిక, నైతిక విలువల ద్వారా సమాజంలో పాజిటివ్ వాతావరణాన్ని పెంచేందుకు మీడియాతో పాటుగా అనేక ఇతర రంగాల్లో చక్కగా కృషి చేస్తున్నారు అని వివరించారు. సోషల్ మీడియాకు తగిన నియంత్రణ ఉండాలని, జర్నలిస్టులు నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ టెక్నాలజీలో అప్ గ్రేడ్ అవుతూ ఉండాలని సూచించారు.

బ్రహ్మా కుమారిస్ మౌంట్ అబూ మీడియా వింగ్ వైస్ చైర్ పర్సన్ బి. కె.సరళ, కో-ఆర్డినేటర్ శాంతను, సైలెన్స్ రిట్రీట్ సెంటర్ డైరెక్టర్లు బి. కె.రాజకుమారి, బి. కె.సునీత ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలు, జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో పాత్రికేయులు ఈ సదస్సుకి హాజరయ్యారు. సమాజంలో దుఃఖం ఇవ్వడం తీసుకోవడం అనే ధోరణి మారితే శాంతి నెలకొంటుందని, జర్నలిస్టుల్లో వ్యక్తిగతంగా ప్రశాంతత, సానుకూల వైఖరి పెంచాలననే ఉద్దేశంతో ఈ సదస్సుని నిర్వహించామని బి. కె.సరళ వివరించారు. రాజయోగ శిక్షణ ద్వారా సమాజంలో అన్ని వర్గాల వారికి శాంతిని పంచేందుకు బ్రహ్మా కుమారీస్ సంస్థ కృషి చేస్తోందని ఆమె చెప్పారు.

కుల మతాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని నివారించే విధంగా వార్తలు ప్రచురిస్తే సమాజంలో ఐక్యత శాంతి నెలకొంటాయని ప్రెస్ కౌన్సిల్ మాజీ సభ్యుడు ఉప్పల లక్ష్మణ్ అన్నారు. సమాజంలో, మీడియాలో ఆధ్యాత్మిక, నైతిక విలువలని పెంపొందించడం కోసం బ్రహ్మా కుమారీస్ ఇలాంటి సదస్సులను నిర్వహించటం అభినందనీయమని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎల్ వేణుగోపాల నాయుడు మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజంలో సహృద్భావాన్ని, సామరస్యతను పెంపొందించే విధంగా పనిచేయాలన్నారు. కుల మత వర్గ విభేదాలు పెరుగుతున్న ప్రస్తుత కాలంలో సామాజిక ఐక్యత కోసం బ్రహ్మా కుమారీస్ అందిస్తున్న ఆధ్యాత్మిక సేవలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు.

మహిళల ద్వారా ఆధ్యాత్మిక రంగంలో విశ్వవ్యాప్తంగా శాంతి,ఐక్యతల కోసం కృషి చేస్తున్న ఏకైక ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మా కుమారీస్ అని మౌంట్ అబూ మీడియా కోఆర్డినేటర్ శాంతను అన్నారు . పాత్రికేయులు ప్రజాస్వామ్య, రాజ్యాంగ మౌలిక అంశాలను అధ్యయనం చేస్తేనే సమాజానికి మేలు చేయగలుగుతారని ఇండోర్ కేబీటీ జర్నలిజం యూనివర్సిటీ మాజీ ఉపకులపతి మాన్సింగ్ పర్మార్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com