ఈ దేశంలో రోజు రోజుకు మనోభావాలు దెబ్బ తింటున్నాయనే నెపంతో చాలా సినిమాలు ట్రోల్ కు గురవుతున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించి సినిమా టైటిల్ వివాదం చర్చకు దారి తీసేలా చేసింది. ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ కీ రోల్ పోషించింది జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీ. తను ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ లో కూడా తళుక్కున మెరిసింది. సూపర్ సక్సెస్ అయ్యింది. మరో వైపు తెలుగులో కూడా నటిస్తోంది. తాజాగా తను నటించిన చిత్రం టైటిల్ వివాదానికి దారి తీయడంతో కొంత నిరాశకు లోనైంది ఈ అమ్మడు.
ఇప్పటికే మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. తీరా సెన్సార్ బోర్డు అనుమతి కోసం వెళితే నో చెప్పారు. కారణం సిల్లీగా ఉంది. అదేమిటంటే జానకి అనే పేరుతో టైటిల్ ఉండడం సబబు కాదని పేర్కొంది. ఇది హిందూ దేవతను ప్రతిఫలిస్తుందని, హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, ముందుగానే కాంట్రావర్సీస్ కు తావు ఇవ్వకుండా చూడాలని ఆదేశించింది.
దీంతో మేకర్స్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము విడుదల చేసేందుకు రెడీ అయ్యామని, ఈ సమయంలో ఎలా తిరస్కరిస్తారంటూ ప్రశించారు. కానీ వినిపించుకోక పోవడంతో అసలు సినిమా వస్తుందా రాదా అన్న అనుమానం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని సెన్సార్ బోర్డు తేల్చి చెప్పింది. వెంటనే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చిత్రం పేరును మార్చాలంటూ పేర్కొంది. జానకిగా అనుపమ , లాయర్ గా సురేష్ గోపి నటిస్తుండడం విశేషం.