నిత్య చైతన్యానికి ప్ర‌తీక గ‌ద్ద‌రన్న – సీఎం

తెలంగాణ అభివృద్దిలో భాగం పంచుకోవాలి

హైద‌రాబాద్ – జ‌య జ‌య‌హే అంటూ నిన‌దించిన అందెశ్రీ‌, జై బోలో తెలంగాణ అంటూ మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరి పోసిన ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర‌న్న త‌మ‌కు స్పూర్తి అని స్ప‌ష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైద‌రాబాద్ లోని హైటెక్స్ లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది తెలంగాణ గ‌ద్ద‌ర్ ఫిలిం అవార్డుల ప్ర‌దానోత్స‌వం. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. వీరితో పాటు సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

వివిధ విభాగాల‌లో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన న‌టీ న‌టుల‌కు అవార్డుల‌ను బ‌హూక‌రించారు. వారికి న‌గ‌దు ప్రోత్సాహ‌కాల‌ను కూడా అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు తెలంగాణ ఫిలిం డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ దిల్ రాజు అలియాస్ వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి. ఈ సంద‌ర్బంగా సీఎం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌ద్ద‌ర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆలోచ‌న‌లు, అభిప్రాయాల‌లో తేడాలు ఉండ‌వ‌చ్చు. కానీ ప్ర‌త్యేక రాష్ట్రం సాధించ‌డంలో, తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డంలో ఆయ‌న కీల‌క పాత్ర వ‌హించార‌ని చెప్పారు.

అందుకే గ‌ద్ద‌ర్ ఫౌండేష‌న్ కు రూ. 3 కోట్లు ఇవ్వ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. మీ అంద‌రి స‌మ‌క్షంలోనే చెక్కును ఇచ్చామ‌న్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ అవార్డుల‌ను అందుకున్న క‌ళాకారులంతా తెలంగాణ రాష్ట్ర అభివృద్దిలో పాలు పంచుకోవాల‌ని పిలుపునిచ్చారు. నిద్రలో కనేది కల. నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొలిపేది కళ. కళకు ప్రాణంపోసే సినీ పరిశ్రమను గుర్తించి, గౌరవించే సాంప్రదాయాన్ని ప్రజా ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందని అన్నారు. తెలంగాణ రైజింగ్ – 2047 ప్రణాళికలో సినీ పరిశ్రమకు ఒక చాప్టర్ ఉండాలన్నది నా ఆకాంక్ష అని స్ప‌ష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com