హైదరాబాద్ – రాష్ట్రంలో కొలువు తీరిన ప్రజా ప్రభుత్వం పాలనా పరంగా గాడి తప్పిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి అవినీతి, అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందన్న విమర్శలు లేక పోలేదు. సాక్షాత్తు క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా నియమితులైన నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిపై ఆ పార్టీకి చెందిన ఆలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఎంపీ దందాలకు తెర లేపాడని, 10 శాతం కమీషన్ తీసుకుంటున్నాడని, పార్టీ కోసం కష్టపడిన తమను పట్టించు కోవడం లేదంటూ ఆరోపించారు. దీనిని స్వయంగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ కామెంట్స్ గాంధీ భవన్ లో కలకలం రేపాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఎక్కడికక్కడ లోపాలను సరి చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా తన దృష్టికి వచ్చిన సమస్యలను సీఎంకు సూచించారు. దీంతో రేవంత్ రెడ్డి పాలనా పరంగా పట్టు పెంచుకునేందుకు విధిగా ఇక నుంచి నెలకు రెండుసార్లు కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.
పథకాలు, పాలన పరమైన ఇబ్బందులు, సమన్వయ లోపాలను అధిగమించడానికి ప్రభుత్వం కసరత్తు చేయనుంది. అమలు చేస్తున్నా గందరగోళం ఎందుకు ఉందో ఆరా తీయనున్నారు. మంత్రులకు పోర్ట్ఫోలియోలపై (శాఖలపై) పట్టులేక పోవడంపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఐఏఎస్ ల బదిలీల తర్వాత మరింత గాడి తప్పింది పాలన.చక్క దిద్దకపోతే నష్టమే అని హెచ్చరించినట్లు సమాచారం.
మీనాక్షి నటరాజన్ జోక్యంతో కొన్ని లోపాలు బహిర్గతం కావడంతో సీఎం రంగంలోకి దిగారు.
