హైదరాబాద్ – ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. వాటిని బాగు చేసేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. చదువు ఒక్కటే బాగు పడేందుకు దోహద పడుతుందన్నారు. విద్యా రంగంలో మౌలికమైన మార్పులు తీసుకు వస్తున్నట్లు తెలిపారు.
సచివాలయంలో విద్యా శాఖపై సమీక్ష చేపట్టారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణకు ఎంత ఖర్చు అయినా వెనుకాడేది లేదన్నారు. రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలు ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. గత ప్రభుత్వం టీచర్ల భర్తీపై శ్రద్ద పెట్ట లేదన్నారు. కానీ తమ సర్కార్ వచ్చాక సీన్ మారిందన్నారు. నాణ్యమైన విద్యను అందించాలన్నదే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి.
ఇప్పటికే తెలంగాణను రోల్ మోడల్ గా చేయాలని సంకల్పించామని చెప్పారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి పాఠశాలలను మరింత బలోపేతం చేస్తామన్నారు.
