అమరావతి – కూటమి సర్కార్ అమలు చేస్తున్న తల్లికి వందనం దేశంలోనే సంచలనం సృష్టించిందని అన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు. ఒకేరోజు రూ. 10 వేల కోట్ల రూపాయలు పైగా తల్లుల ఎకౌంట్లో జమ చేయడం ఓ రికార్డ్ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా సుపరిపాలనకు తొలి అడుగులోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేశామన్నారు. వైసిపి ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మ ఒడి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఒక్కరికే అని మోసం చేశారని గుర్తు చేశారు.
చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నలుగురు పిల్లల ఉన్న తల్లులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తూ ఎకౌంట్లో 60 వేల రూపాయలు జమ చేశారని చెప్పారు దేవినేని ఉమా మహేశ్వర్ రావు.
పాతిక లక్షల మందికి అమ్మ ఒడి డబ్బులు ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తున్నాడని నిలదీశారు. విద్రోహశ క్తులను రెచ్చ గొడుతూ.. గంజాయి బ్యాచ్ ని పరామర్శించడానికి వచ్చి మహిళలు, పోలీసులపై రాళ్లు, చెప్పులతో విచక్షణ రహితంగా దాడి చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా రైతుల ఎకౌంట్లో ఈ నెలలోనే జమ చేస్తామన్నారు దేవినేని ఉమా మహేశ్వర్ రావు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. అన్న క్యాంటీన్లతో కూటమి ప్రభుత్వం ప్రతిరోజు లక్షలాదిమంది పేదల ఆకలి తీరుస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏడాదికి 34 వేల కోట్లు ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమన్నారు.