తిరుమల – టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమలకు రాకపోకలు సాగించే కనుమ దారుల యందు ( ఘాట్ రోడ్డులలో) బీ.టీ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలని కోరారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు.
శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసి వేయకుండా నిర్దేశించిన సమయంలో మరమ్మత్తు పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. కనుక, భక్తులు తమ తిరుమల ప్రయాణాన్ని ప్రణాళికబద్ధంగా మార్చుకుని కనీసం గంట సమయం ముందుగా ప్రారంభించాలని టిటిడి కోరుతోందన్నారు.
మరమ్మతుల కారణంగా వాహనదారులు నెమ్మదిగా అక్కడక్కడా కొద్ది సేపు ఆగుతూ ప్రయాణించాల్సి ఉంటుందనే విషయాన్ని భక్తులు గమనించాలని సూచించారు. భక్తులు మరింత సులభంగా, సౌకర్యంగా ప్రయాణించేేందుకు ఈ మరమ్మతు పనులను టిటిడి చేపట్టిందన్నారు ఈవో.
ఈ నేపథ్యంలో భక్తులు రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వేస్టేషన్, ఆర్డీసీ బస్ స్టాండ్ ప్రాంతాల నుండి తిరుమల విచ్చేసే వాహనదారులు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని టిటిడి సూచిస్తోంది.
మరమ్మతు పనులను పూర్తి చేయడానికి టిటిడిలోని ప్రతి విభాగం అప్రమత్తంగా ఏర్పాట్లు చేపట్టిందన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు తిరుమల చేరుకోవాలని కోరారు ఈవో. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి కావడానికి భక్తులు, వాహదారులు సహకరించాలని టిటిడి కోరుతోందన్నారు. అత్యవసర సేవలకు టిటిడి టోల్ ఫ్రీ నెంబర్ 155257 కు సంప్రదించాలని సూచించారు.