అరాచ‌కాల‌కు కేరాఫ్ గా మారిన ఏపీ

మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి – ఆంధ్రప్రదేశ్‌ అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారి పోయిందన్నారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయి పోతున్నాయన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని ఆరోపించారు. ఏడాది కాలంగా చంద్ర‌బాబు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచి వేయడానికి యత్నిస్తున్నారంటూ ఆరోపించారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్టు చేసి కక్ష సాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారని ధ్వ‌జ‌మెత్తారు.

సహజంగా ఒక డిబేట్‌ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్‌కు ఏం సంబంధం అని ప్ర‌శ్నించారు. సహజంగానే ఓ డిబేట్‌లో వక్తలు కొందరు అనుకూలంగానూ, కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారని పేర్కొన్నారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలా మంది గెస్ట్‌లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా అని నిల‌దీశారు జ‌గ‌న్ రెడ్డి.

ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్‌లను డైవర్ట్‌ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నార‌ని మండిప‌డ్డారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారికాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడని ఆరోపించారు. ఆయన నిష్ప‌క్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్‌పై ( గతంలో, సాక్షి కాదు) ఆంక్షలు విధించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com