అమరావతి – ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి సర్కార్ కావాలని తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. గురువారం జగన్ మీడియాతో మాట్లాడారు. కార్యకర్తలు, ప్రజలను పరామర్శించేందుకు వెళితే తప్పేంటని ప్రశ్నించారు. ఇలా ఎందుకు ఆంక్షలు పెడుతున్నారంటూ మండిపడ్డారు. పోలీసులు బారికేడ్లు ఎందుకు పెట్టారంటూ ప్రశ్నించారు.
నారా చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పొదిలిలో 40 వేల మంది నా కోసం వచ్చారన్నారు. 40 మందితో నామీద రాళ్లు వేయించాలని చూశారని వాపోయారు. సమన్వయం పాటించారు కాబట్టే ఇక్కడికి వచ్చిన వారంతా 40 మంది మీద పడలేదన్నారు జగన్ రెడ్డి. అంతే కాదు గొడవ చేయించారు, కేసులు పెట్టించారంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు పదే పదే సహనం కోల్పోతున్నారంటూ ఫైర్ అయ్యారు.
రైతులకు సంఘీభావంగా ఎవరూ వెళ్లకూడదా అని మాజీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోపే వ్యతిరేకత వచ్చిందన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వటం లేదన్నారు. రైతులు అష్టకష్టాలు పడుతున్నారని వాపోయారు జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.