అమరావతి – మాజీ మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు. మంత్రి కొల్లు రవీంద్ర తనపై చేసిన కామెంట్స్ పై భగ్గుమన్నారు. దమ్ముంటే రుజువులు చేయాలని సవాల్ విసిరారు. పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఆనాడు తమ ప్రభుత్వ హయాంలో అర్హులైన లబ్దిదారులకు తానే దగ్గరుండి పట్టాలు పంపిణీ చేశానని చెప్పారు. అవి నకిలీ పట్టాలని కొల్లు రవీంద్ర చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అవి నకిలీవని రుజువు చేయాలని కొల్లు రవీంద్రకు సవాల్ విసిరారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తయిందని, విజయోత్సవాలు జరుపుకుంటున్నారని, మరి ఇంత కాలం ఏం చేశారంటూ ప్రశ్నించారు పేర్ని నాని. అన్ని వ్యవస్థలు మీ వద్దనే ఉన్నాయని, విచారణ జరిపించు కోవచ్చని పేర్కొన్నారు. చిల్లర రాజకీయాలు చేయడం పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. కేవలం కక్ష సాధింపు చర్యలకు దిగడం తప్పితే రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. అమలుకు నోచుకోని హామీలను ఇవ్వడం తప్ప ఏం చేశారంటూ ఫైర్ అయ్యారు.
పంచిన ప్రతి పట్టా 10 ఏళ్ల తర్వాత లబ్దిదారుల సొంత ఆస్తి అని ఆనాటి సీఎం జగన్ జీవో తెచ్చారని అన్నారు పేర్ని నాని. అందరికీ స్థలం చూపించి జియో ట్యాగింగ్ చేయడం జరిగందన్నారు. ఎలక్షన్లకు ముందు జిల్లా యంత్రాంగం చేసిన దానికి తనకు సంబంధం లేదన్నారు మాజీ మంత్రి.
రేషన్ బియ్యం మాయం వాస్తవమేనని ఒప్పుకున్నారు.కానీ మాకే పాపం తెలియదని తన తల్లి మీద ప్రమాణం చేస్తున్నానని చెప్పారు పేర్ని నాని.